భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చడమే లక్ష్యంగా 2026 బడ్జెట్ అడుగులు వేసింది. మౌలిక సదుపాయాలు అనేవి దేశ ప్రగతికి ఇంజన్లు వంటివి. అందుకే, ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడమే కాకుండా, ప్రపంచం గర్వించేలా అత్యాధునిక రవాణా, పారిశ్రామిక వ్యవస్థల నిర్మాణానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. సామాన్యుడి ప్రయాణం సులభతరం చేస్తూనే, దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రపథంలో నిలిపేలా ఈ ప్రణాళికలు రూపొందాయి. బడ్జెట్ 2026 లోని అంశాలను చూస్తే ..
వికసిత్ భారత్ దిశగా: మౌలిక సదుపాయాల విప్లవం: రికార్డు స్థాయి కేటాయింపులు (Capex Boost) దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 12.2 లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇది గత ఏడాది కంటే 11.5% ఎక్కువ. ఇక రహదారులు, రైల్వేలు, ఓడరేవుల నిర్మాణానికి ఈ నిధులు వెన్నెముకగా నిలుస్తాయి. ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రైవేట్ రంగంలో కూడా ఉత్సాహం పెరిగి, లక్షలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
హైస్పీడ్ రైలు కారిడార్లు: ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ను బెంగళూరు, చెన్నై మరియు పూణే నగరాలతో అనుసంధానించనున్నారు.ఇక ఇది కేవలం ప్రయాణానికే కాదు, దక్షిణ భారత దేశంలో వ్యాపార రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. అలాగే 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రవాణా ఖర్చులు భారీగా తగ్గనున్నాయి.

నగరాల అభివృద్ధి – ఎకనామిక్ రీజియన్స్: దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చేందుకు ‘సిటీ ఎకనామిక్ రీజియన్స్’ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు.ఇక ప్రతి CER అభివృద్ధికి ఐదేళ్లలో రూ. 5,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల నగరాల్లో మౌలిక వసతులు మెరుగుపడి, పరిశ్రమలు తరలివస్తాయి. తద్వారా స్థానికంగానే యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.
గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ కనెక్టివిటీ: ఇక పర్యావరణాన్ని కాపాడుతూనే అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్రం ‘గ్రీన్ లాజిస్టిక్స్’కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక సుమారు 4,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం రేర్ ఎర్త్ ఖనిజాల వెలికితీతకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేయడం వంటివి ఇందులో భాగం. ఇక అటు డిజిటల్ రంగంలో ‘సెమీకండక్టర్ మిషన్ 2.0’ ద్వారా భారత్ను గ్లోబల్ చిప్ తయారీ హబ్గా మార్చేందుకు రూ. 40,000 కోట్లు కేటాయించారు.
మొత్తంగా చూస్తే బడ్జెట్ 2026 కేవలం అంకెల గజబిజి కాదు, అది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపం. అటు అన్నదాతకు భరోసా ఇస్తూ, ఇటు యువతకు నైపుణ్యాలనే ఆయుధాలను అందిస్తూ దేశాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. ‘వికసిత్ భారత్’ అనే గొప్ప కల నిజం కావాలంటే ప్రభుత్వం చేసే కృషికి, ప్రజల భాగస్వామ్యం కూడా తోడవాలి.
