బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, సామాన్యుడికి అది అందని ద్రాక్షలా మారినా.. దేశాల మధ్య మాత్రం ‘బంగారు’ పోరు నడుస్తోంది. యుద్ధాలు, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక అనిశ్చితుల నుండి తట్టుకోవడానికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు పోటీ పడి మరీ పసిడిని నిల్వ చేసుకుంటున్నాయి. మరి ఈ రేసులో అమెరికాను మించిన దేశం ఉందా? అపారమైన పసిడి సంపద గల మన భారత్ స్థానం ఎక్కడ? ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చే ఈ గోల్డ్ రిజర్వ్స్ గురించిన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందా..
అగ్రరాజ్యం అమెరికాదే పైచేయి ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా వద్ద సుమారు 8,133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇది మిగిలిన మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల మొత్తం నిల్వలకు సమానం. అమెరికాలోని ‘ఫోర్ట్ నాక్స్’ భవనంలో ఈ పసిడి నిధిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దాచి ఉంచుతారు. డాలర్ విలువ పడిపోయినప్పుడు లేదా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఈ బంగారమే ఆ దేశానికి శ్రీరామరక్ష.

ఐరోపా దేశాల హవా అమెరికా తర్వాత జర్మనీ (3,350 టన్నులకు పైగా), ఇటలీ (2,451 టన్నులు), మరియు ఫ్రాన్స్ (2,436 టన్నులు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐరోపా దేశాలు కూడా తమ కరెన్సీ విలువను కాపాడుకోవడానికి పసిడిని భారీగా నిల్వ చేసుకుంటాయి. గత దశాబ్ద కాలంగా రష్యా, చైనా దేశాలు కూడా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి తమ గోల్డ్ రిజర్వ్స్ను శరవేగంగా పెంచుకుంటున్నాయి.
భారతదేశం స్థానం ఎక్కడ? మనం బంగారాన్ని అమితంగా ప్రేమిస్తాం. అయితే దేశాల పరంగా చూస్తే, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద ఉన్న పసిడి నిల్వలు మనల్ని ప్రపంచంలో 9వ స్థానంలో (ప్రస్తుత అంచనాల ప్రకారం) నిలబెట్టాయి. భారతదేశం వద్ద సుమారు 800 మెట్రిక్ టన్నులకు పైగా బంగారం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతీయ గృహిణుల వద్ద ఉన్న బంగారం (సుమారు 25,000 టన్నులు) ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారం కంటే కూడా ఎక్కువేనని అంచనా!
బంగారం ఎందుకు నిల్వ చేస్తారు? కరెన్సీ విలువ పడిపోయినా, మార్కెట్లు కుప్పకూలినా బంగారం విలువ తగ్గదు. అందుకే దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను ‘సేఫ్’ జోన్లో ఉంచడానికి బంగారాన్ని ఒక ఇన్సూరెన్స్లా భావిస్తాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, కాగితపు కరెన్సీ కంటే పసిడినే నమ్ముతాయి.
