పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎక్కడో ఉండవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం మన వంటింటి వరకు వచ్చేసింది. దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడటంతో ముఖ్యంగా హోటల్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. మనం ఎంతో ఇష్టంగా తినే దోశ, వడలు మెనూ నుంచి మాయమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ..
మెనూ మారుతోంది జాగ్రత్త: హోటల్కు వెళ్లగానే మనం ముందుగా ఆర్డర్ చేసే దోశ, వడలకు ఇప్పుడు గ్యాస్ గండం పొంచి ఉంది. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం, ఎక్కువ గ్యాస్ అవసరమవుతుంది. అందుకే గ్యాస్ ఆదా చేసేందుకు చాలా మంది హోటల్ యజమానులు వీటిని మెనూ నుంచి తొలగిస్తున్నారు. ఇక వాటికి బదులుగా తక్కువ వేడితో తయారయ్యే శాండ్విచ్లు, బ్రెడ్ ఐటమ్స్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఓవెన్ వంటకాలకు డిమాండ్: గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవడానికి హోటల్ నిర్వాహకులు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఓవెన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బేక్ చేసిన వంటకాలు, గ్రిల్డ్ శాండ్విచ్లు వంటివి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. దీనివల్ల గ్యాస్ వాడకం తగ్గడమే కాకుండా, పని కూడా త్వరగా పూర్తవుతుందని వారు భావిస్తున్నారు. ఇక అయితే మన దేశీ టిఫిన్లను ఇష్టపడే వారికి మాత్రం ఇది కొంత నిరాశ కలిగించే విషయమే.
మళ్లీ కట్టెల పొయ్యి కాలం: సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో కొందరు హోటల్ యజమానులు పాత కాలం నాటి కట్టెల పొయ్యిలను మళ్లీ వెలిగిస్తున్నారు. ప్రత్యామ్నాయం లేక కట్టెలు, బొగ్గును వాడుతూ ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇలా చేయడం వల్ల వంటకు ఎక్కువ సమయం పడుతున్నా, కస్టమర్లను వదులుకోలేక ఈ కష్టాలు పడుతున్నారు.
కస్టమర్లకు తప్పని తిప్పలు: హోటళ్లు మూతపడటం లేదా మెనూలో మార్పులు చేయడం వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్, ఉద్యోగులు హోటల్ ఆహారంపైనే ఆధారపడతారు. ఇప్పుడు తమకు నచ్చిన వంటకాలు దొరక్కపోవడంతో వారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇక ఈ గ్యాస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు.
