పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక సంచలన పోస్ట్తో ఇరాన్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వేలమంది భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమై, కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు ట్రంప్ ఏమన్నారు? ఇరాన్ ఎలా స్పందించింది? అక్కడ ఉన్న భారతీయులు ఇప్పుడు ఏం చేయాలి? అనే వివరాలు మీకోసం.
ట్రంప్ హెచ్చరిక.. పెరిగిన టెన్షన్: ఇక డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ట్రూత్’లో చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమయ్యే అవకాశం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధ భయాన్ని పెంచాయి. ఇక ఈ రాత్రి చరిత్రలోనే అత్యంత కీలకం కాబోతోందని ఆయన పేర్కొనడంతో, ఇరాన్పై భారీ దాడులు జరిగే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
భారత రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు: ఇరాన్ లోని పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే అక్కడ ఉన్న భారత పౌరుల భద్రత కోసం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయ్యింది. వచ్చే 48 గంటల పాటు భారతీయులు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి పరిస్థితులను గమనిస్తూ, మన వాళ్లకు రక్షణగా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్ ధీటైన సమాధానం: ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ కూడా గట్టిగానే స్పందించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, దౌత్యపరమైన చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాదు, అమెరికా తన వైఖరి మార్చుకోకపోతే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని స్తంభింపజేసిన ఇరాన్, ఇప్పుడు మరో కీలక జలసంధిని మూసేస్తామనడం అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
కువైట్పై డ్రోన్ల దాడి: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకూ ముదురుతోంది. గత 24 గంటల్లో కువైట్పై ఏకంగా 17 డ్రోన్ దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దాడులు ఎవరి నుంచి జరిగాయనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఈ ప్రాంతంలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాలన్నీ యుద్ధం మరో కీలక మలుపు తిరుగుతోందనడానికి సంకేతంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇరాన్లో ఉన్న పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం కాస్తా ఫిజికల్ వార్గా మారుతుందా అనే భయం అందరిలోనూ ఉంది. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. భారత ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తూ తదుపరి చర్యలు తీసుకుంటోంది.
