ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య అధిక రక్తపోటు (హైబీపీ). ఎలాంటి ముందస్తు హెచ్చరికలు, స్పష్టమైన లక్షణాలు లేకుండానే శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టే వైద్యులు దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ సమస్య, నేడు పట్టుమని ముప్పై ఏళ్లు కూడా లేని యువతను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
యువతపై హైబీపీ పంజా: మారుతున్న ఆధునిక జీవనశైలి యువతను హైబీపీ బారిన పడేలా చేస్తోంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం ఆఫీస్ ఒత్తిడి, నిరంతరం జంక్ ఫుడ్స్ తినడం శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం వంటి అలవాట్ల వల్ల యువతలో రక్తపోటు వేగంగా పెరుగుతోంది. ఇక దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండె మెదడు కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడి ప్రాణాలకే ముప్పు రావచ్చు.
మే 17 అవగాహనే ఆయుధం: ప్రజల్లో అధిక రక్తపోటుపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే 17వ తేదీన ‘ప్రపంచ రక్తపోటు దినోత్సవం’(World Hypertension Day) నిర్వహిస్తారు. ఇక బీపీ వల్ల కలిగే ప్రమాదాలను ముందే గుర్తించి దానిని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియజెప్పడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

బీపీని కట్టడి చేసే జాగ్రత్తలు: ఉప్పు నియంత్రణ: ఆహారంలో సోడియం (ఉప్పు) మోతాదును బాగా తగ్గించాలి. ఇక నిల్వ పచ్చళ్లు అప్పడాలు, చిప్స్ ప్రాసెస్ చేసిన ప్యాకెట్ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం: తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను రోజువారీ డైట్లో భాగం చేసుకోవాలి. ఇక ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
క్రమం తప్పని వ్యాయామం: ఇక రోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం, రన్నింగ్, సైక్లింగ్ లేదా ఏదో ఒక వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
ఒత్తిడికి చెక్: ఇక మానసిక ఒత్తిడి బీపీని అకస్మాత్తుగా పెంచుతుంది. అందుకే రోజూ కొద్దిసేపు ధ్యానం, యోగా చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
గమనిక : జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం, క్రమంతప్పకుండా బీపీ చెకప్ చేయించుకోవడం ద్వారా ఈ సైలెంట్ కిల్లర్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
