ఎండలు ముదిరిపోతున్నప్పుడు శరీరాన్ని చల్లబరుచుకోవడానికి మనకు గుర్తొచ్చే మొదటి ఆప్షన్లు పెరుగు, మజ్జిగ. ఈ రెండూ పాల పదార్థాలే అయినప్పటికీ, వేసవిలో వీటిని తీసుకునే విధానం, వీటి వల్ల కలిగే ప్రయోజనాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఏ సమయంలో వేటిని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రెండింటిలో ఉండే విటమిన్లు ఇవే: పెరుగులో విటమిన్ బి12, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. ఇక మజ్జిగ విషయానికి వస్తే.. పెరుగును చిలకడం వల్ల ఇందులో నీటి శాతం పెరుగుతుంది.మజ్జిగలో విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ డి, కాల్షియం మరియు ప్రొటీన్లు ఉంటాయి.ఇక వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి మజ్జిగలోని విటమిన్లు ఎలక్ట్రోలైట్లు బాగా సహాయపడతాయి.

పెరుగును ఉదయం పూట ఎందుకు తినాలి?: ఆయుర్వేదం ప్రకారం పెరుగు శరీరానికి బలాన్ని, కొవ్వును ఇస్తుంది. ఇది అరగడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది.అందుకే పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం పూట తినాలని పెద్దలు చెబుతారు.ఇక ఉదయాన్నే పెరుగు తినడం వల్ల రోజంతా శరీరానికి అవసరమైన ఎనర్జీ లభిస్తుంది మరియు జీర్ణక్రియ చురుగ్గా సాగుతుంది.
మజ్జిగను రాత్రి పూట ఎందుకు తాగాలి?: మజ్జిగ చాలా తేలికగా ఉంటుంది మరియు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. రాత్రి పూట హెవీగా ఉండే పెరుగు తింటే కఫం పెరిగే అవకాశం ఉంది. కానీ మజ్జిగ తాగడం వల్ల తిన్న ఆహారం సులువుగా అరుగుతుంది.ఇక రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మజ్జిగ తాగితే కడుపులో ఉబ్బరం తగ్గుతుంది, హాయిగా నిద్ర పడుతుంది.
వేసవిలో ఏది బెటర్?: వేసవి కాలంలో పెరుగు కంటే మజ్జిగ తాగడమే ఎక్కువ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు శరీరంలో ఒక్కోసారి వేడిని పెంచే అవకాశం ఉంది, కానీ మజ్జిగ శరీరానికి తక్షణ చలువను ఇస్తుంది. ఎండల వల్ల కోల్పోయే నీటి శాతాన్ని మజ్జిగ వెంటనే భర్తీ చేస్తుంది.
సారాంశం ఏంటంటే.. వేసవిలో పెరుగు, మజ్జిగ రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే ఎండల తీవ్రతను తట్టుకోవడానికి, బరువు అదుపులో ఉంచుకోవడానికి మజ్జిగను అమృతంగా భావించవచ్చు. ఇక సమయాన్ని బట్టి వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగుండదు.
గమనిక: జలుబు, దగ్గు లేదా ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి పూట మజ్జిగ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ఆరోగ్యవంతులు ఎవరైనా దీనిని నిరభ్యంతరంగా తాగవచ్చు.
