ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ భోగాపురంలో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఏపీ విభజన తర్వాత నిర్మితమైన తొలి అంతర్జాతీయ విమానాశ్రయం ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రధానికి 13,750 మంది గిరిజన కళాకారులు ‘థింసా’ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. ప్రపంచ స్థాయి హంగులతో సిద్ధమైన ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ క్లాస్ రన్వే, టెర్మినల్ నిర్మాణం: ఈ విమానాశ్రయంలో 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రెండు భారీ రన్వేలను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఎయిర్బస్, బోయింగ్ వంటి అతిపెద్ద విమానాలు కూడా అత్యంత సులభంగా ల్యాండ్ కాగలవు. అంతేకాకుండా ఎగిరే చేప ఆకారంలో 79 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ను డిజైన్ చేశారు. ఇందులో ఒకేసారి 45 విమానాలను పార్కింగ్ చేసే వెసులుబాటు ఉంది.

అత్యాధునిక సదుపాయాలు: ప్రయాణికుల సౌకర్యార్థం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 10 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. లగేజ్ కోసం 5 డొమెస్టిక్, 2 ఇంటర్నేషనల్ బ్యాగేజీ బెల్టులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు డిజిటల్ టెక్నాలజీతో కూడిన ఇంటర్నేషనల్ లాంజ్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, ప్రపంచ స్థాయి ఆహార కేంద్రాలను తీర్చిదిద్దారు.
ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త ఊపు: విశాఖకు 45 కి.మీ, విజయనగరానికి 25 కి.మీ, శ్రీకాకుళానికి 63 కి.మీ దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రీజియన్లో టూరిజం, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు విపరీతంగా విస్తరించనున్నాయి. ఇక స్థానిక రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులైన ఆక్వా, అగ్రికల్చర్, హార్టికల్చర్ వస్తువులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసే కార్గో సదుపాయం కలగడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఇక అత్యాధునిక సాంకేతికత, మనోహరమైన డిజైన్, ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ప్రయాణాలకే కాకుండా, మొత్తం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేసి ఆర్థిక రంగానికి పెద్ద ఊతంగా నిలవనుంది.
