భారతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే అద్భుత క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం. ఒడిశాలోని భువనేశ్వర్కు 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రక ప్రాచీన ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఒకప్పుడు భక్తులతో, నిత్య పూజలతో వెలిగిపోయిన ఈ క్షేత్రం ఆక్రమణలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల శిథిలమై ప్రస్తుతం ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. కోణార్క్ ఆలయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు, మిస్టరీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
13వ శతాబ్దపు అద్భుత నిర్మాణం: ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1250 ప్రాంతంలో తూర్పు గంగ రాజవంశానికి చెందిన రాజు నరసింహ దేవ్-I నిర్మించారు. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ఈ ఆలయం అంకితం చేయబడింది. ఇక ఆలయానికి ఇరువైపులా చెక్కిన 12 జతల చక్రాలు కేవలం అలంకారం మాత్రమే కాదు, అవి సమయాన్ని ఖచ్చితంగా తెలిపే గడియారాలుగా పనిచేస్తాయి.

కాంత శక్తి, దాచిన ఇసుక మిస్టరీ: ఈ ఆలయం పైభాగంలో ఒక శక్తివంతమైన అయస్కాంత రాయి ఉండేదని, కానీ ఆక్రమణల వల్ల అది ఎక్కడో కనుమరుగైందని చెబుతారు. ఇక 15వ శతాబ్దంలో విగ్రహాన్ని కాపాడటానికి పూజారులు పూరీకి తరలించారు. ఇక 1903లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షణ పనులు ప్రారంభించే క్రమంలో, ఆలయాన్ని కూలిపోకుండా కాపాడేందుకు 118 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు ఆలయ గర్భగుడిని పూర్తిగా ఇసుకతో నింపేశారు.
12 ఏళ్ల బాలుడి త్యాగం: ఈ ఆలయ నిర్మాణంలో ధర్మపద అనే 12 ఏళ్ల బాలుడి ఆత్మత్యాగం ఒక కన్నీటి గాథ. 1,200 మంది శిల్పులు 12 ఏళ్లు శ్రమించినా పూర్తి చేయలేని ఆలయ శిఖర భాగపు ‘కీ-స్టోన్’ను ప్రధాన శిల్పి బిసు మహారాణ కుమారుడైన ధర్మపద రాత్రికి రాత్రే పూర్తి చేశాడు. అయితే, ఒక చిన్నపిల్లవాడు ఈ పని చేశాడని తెలిస్తే రాజు తమ తలలు నరికిస్తాడనే భయంతో ఉన్న శిల్పుల ప్రాణాలను కాపాడేందుకు ఆ బాలుడు ఆలయ శిఖరం పైనుంచి చంద్రభాగా నదిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు.
ఇక ఎన్నో చారిత్రక దాడులు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడిన కోణార్క్ సూర్య దేవాలయం మన ప్రాచీన భారతీయుల వాస్తు శాస్త్రానికి, శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. నేటికీ ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఈ ఆలయం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇక సూర్య దేవాలయ గర్భగుడిలో దశాబ్దాలుగా ఉన్న ఇసుకను సురక్షితంగా తొలగించి, నిర్మాణం దెబ్బతినకుండా లోపలి భాగాలను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
