వినాయక చవితి పండగ ప్రారంభం కాగానే అందరి మదిలో మెదిలే ప్రధానమైన ప్రశ్న ‘గణేష్ నిమజ్జనం ఎప్పుడు?’ అని. కొంతమంది 1, 3, 5 లేదా 7వ రోజులలో నిమజ్జనం చేస్తే, తొమ్మిది రోజులు నవరాత్రుల పూజలందుకున్న గణపయ్యకు అనంత చతుర్దశి రోజున ఘనంగా వీడ్కోలు పలుకుతారు. మరి ఈసారి అనంత చతుర్దశి తేదీ, నిమజ్జనం శుభ ముహూర్తాలు ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అనంత చతుర్దశి సెప్టెంబర్ 25నే!: తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద శుక్ల చతుర్దశి తిథి సెప్టెంబర్ 24 రాత్రి 09:53 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 25 రాత్రి 10:10 గంటల వరకు ఉంటుంది. ఇక శాస్త్ర ప్రకారం ఉదయించే తిథినే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి సెప్టెంబర్ 25 శుక్రవారం రోజే అనంత చతుర్దశి వ్రతం మరియు గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి.
నిమజ్జనానికి శుభ ముహూర్తాలు: సెప్టెంబర్ 25న నిమజ్జనం చేయడానికి రోజంతా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఇళ్లలో పూజించే విగ్రహాలకు ఉదయం 6:11 నుండి 10:42 వరకు అత్యంత అనుకూలమైన సమయం. మధ్యాహ్నం 12:13 నుండి 1:43 వరకు, సాయంత్రం 4:44 నుండి 6:14 వరకు అలాగే రాత్రి 9:14 నుండి 10:43 వరకు బహిరంగ పండాల్ నిమజ్జనాల కోసం ఎంచుకోవచ్చు.

బప్పాకు వీడ్కోలు చెప్పే సరైన పద్ధతి: నిమజ్జనానికి ముందు వినాయకుడికి ఎర్రని పువ్వులు, దూర్వా (గరికె), మోదకాలు నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. ఇక పూజలో తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని, వచ్చే ఏడాది మళ్లీ త్వరగా రావాలని ప్రార్థించాలి. నిమజ్జనానికి తరలించే ముందు విగ్రహాన్ని కొద్దిగా ముందుకు జరపడం మన సాంప్రదాయం.
పర్యావరణ హితంగా నిమజ్జనం: ఇంట్లో ప్రతిష్ఠించిన చిన్న మట్టి విగ్రహాలను ఒక పెద్ద నీటి బకెట్ లేదా పాత్రలో కరిగించి, ఆ నీటిని చెట్లలో లేదా మొక్కల్లో పోయడం పర్యావరణానికి ఎంతో మంచిది. ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా రసాయన రంగుల విగ్రహాలను నదులు, చెరువులలో నిమజ్జనం చేయకుండా స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేసిన కృత్రిమ కుంటలలో మాత్రమే వేయాలి.
ఇక పరమ శివుని దివ్య ఆశీస్సులతో, బొజ్జ గణపయ్యకు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలకడానికి సెప్టెంబర్ 25వ తేదీని గుర్తుంచుకోండి. ఇక సరైన ముహూర్తంలో స్వామివారిని సాగనంపి, సుఖసంతోషాలను పొందండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ,కాబట్టి మీ స్థానిక పంచాంగం లేదా పండితుల సలహాలను పాటించడం మంచిది.
