ఈ రోజుల్లో పిల్లలు మారం చేయకుండా అన్నం తినాలని చాలామంది తల్లిదండ్రులు చేతిలో ఫోన్ పెట్టడం లేదా టీవీ చూపించడం అలవాటు చేస్తున్నారు. కానీ, స్క్రీన్లు చూస్తూ భోజనం చేయడం వల్ల పిల్లల మానసిక శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా తింటూ ఫోన్ చూడటం వల్ల డిప్రెషన్ బారిన పడే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మరి ఈ చిన్న అలవాటు పిల్లలపై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం..
జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది: ఎయిమ్స్ పీడియాట్రిక్ నిపుణుడు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ చూస్తూ తినడం వల్ల పిల్లలు సరిగ్గా నమలకుండా ఆహారాన్ని మింగేస్తుంటారు. ఇక దీనివల్ల జీర్ణక్రియ బలహీనపడి అజీర్ణం, గ్యాస్ మరియు తీవ్రమైన పొట్ట సమస్యలు తలెత్తుతాయి.
ఊబకాయం లేదా పోషకాహార లోపం: స్క్రీన్ వైపు చూస్తూ తినేటప్పుడు పిల్లలు ఎంత తింటున్నారనే దానిపై దృష్టి ఉండదు. ఇక దీనివల్ల కొందరు ఆకలి కంటే ఎక్కువగా తిని ఊబకాయం బారిన పడితే, మరికొందరు సరిగ్గా తినక పౌష్టికాహార లోపానికి గురవుతారు.

కంటి చూపు సమస్యలు: భోజనం చేసే సమయంలో ఫోన్ స్క్రీన్ను దగ్గరగా ఉంచుకుని చూడటం వల్ల పిల్లల కళ్ళు త్వరగా అలసిపోతాయి. ఇక చిన్న వయసులోనే కంటి చూపు తగ్గడం, కళ్లలో మంటలు రావడం వంటి సమస్యలు మొదలవుతాయి.
మానసిక ఆరోగ్యం – సామాజిక నైపుణ్యాలు: ఫోన్కు బానిసలుగా మారడం వల్ల పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడటం తగ్గడం వల్ల వారిలో సామాజిక నైపుణ్యాలు పూర్తిగా దెబ్బతింటాయి.
పిల్లలు సులువుగా తింటున్నారని మనం ఇచ్చే స్మార్ట్ఫోన్ వారి భవిష్యత్తుకే ముప్పుగా మారుతోంది. కాబట్టి చిన్నప్పటి నుంచే భోజన సమయంలో ఫోన్ చూసే అలవాటును మాన్పించి, కుటుంబంతో కలిసి కూర్చుని తినడం నేర్పించడం చాలా అవసరం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మీ పిల్లల్లో తీవ్రమైన అలవాట్లు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే బాలల వైద్య నిపుణులను (Pediatricians) సంప్రదించండి.
