ది కేరళ స్టోరీ సినిమాపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు

-

 

ది కేరళ స్టోరీ సినిమాపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా?… అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా…. ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం అన్నారు.


సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ది కేరళ స్టోరీ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? మనది ప్రజాస్వామిక దేశం… జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో… వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణం అని ఫైర్ అయ్యారు రాములమ్మ.

గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయంలోనూ ఇలాగే కొన్ని వర్గాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. సినిమా ప్రదర్శనని ఆపగలరేమో… కానీ అందులోని సత్యం మాత్రం గుండెల్ని చీల్చుకుని మనసుల్లో నాటుకోవడం ఖాయమని గుర్తించండి. ఒక సినిమా చూస్తేనే శాంతిభద్రతలు చెయ్యి దాటిపోయే సమస్య ఆ నిషేధించిన 3 రాష్ట్రాలలో ఉండి… మిగతా దేశంలోని 27 రాష్ట్రాలకు ఆ పరిస్థితి లేదంటే అది ఆ నిషేధించిన రాష్ట్రాల పాలనా వైఫల్యం అయితదా?… లేక మెజారిటీ ప్రజల మనోభావాలను గుర్తించని మరో విధానం అయితదా?… వారికే తెలియాలన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version