సహజంగా ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపిస్తారు. పైగా ఇతరుల చెప్పిన సూచనలు పాటిస్తూ జీవన విధానంలో మార్పులు చేసుకుంటారు. అదే విధంగా, ఈ మధ్య చాలా మంది ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మంచి నీరు లేక నిమ్మరసాన్ని తాగుతున్నారు. నిమ్మరసం వలన అనారోగ్యం తగ్గుతుందని, ఎంతో ఆరోగ్యంగా ఉంటామని భావించి నిమ్మరసాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత చాలా శాతం మంది జీవన శైలిలో మార్పులను చేసుకున్నారు మరియు ఆరోగ్యం బాగుండాలని నిమ్మరసాన్ని తాగుతున్నారు. అయితే, నిమ్మరసాన్ని తాగడం వలన శరీరానికి పుష్కలంగా విటమిన్ సి అందుతుంది.
ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండడానికి నిమ్మరసం ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే నిమ్మరసం కొందరిలో అనారోగ్యాన్ని తీసుకువస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తాగకూడదు. ఎసిడిటీ ఉన్నవారు నిమ్మరసాన్ని తాగడం వలన గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, ఎనామిల్ బలహీనంగా ఉండేవారు నిమ్మరసాన్ని తాగకూడదు. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, దంతాలపై ఉండే ఎనామిల్ను బలహీనంగా మారుస్తుంది.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసాన్ని తీసుకోకపోవడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగడం వలన కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. కనుక కిడ్నీలో రాళ్లు లేక ఇతర కిడ్నీ సమస్యలతో బాధపడితే నిమ్మరసానికి దూరంగా ఉండండి. ఎప్పుడైతే కీళ్ల నొప్పులు తరచుగా ఎదుర్కొంటున్నారో, నిమ్మరసాన్ని తీసుకోకూడదు. నిమ్మకాయల్లో ఉండే ఆసిడ్ ఎముకల్లో కాల్షియం ను తగ్గిస్తుంది. కనుక ఎముకలు బలహీనంగా మారుతాయి. కాబట్టి, ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే నిమ్మరసాన్ని తాగకపోవడమే మేలు అని నిపుణులు చెబుతున్నారు.