నేడు ఐటీ ఎదుట హాజరుకానున్న రేవంత్ రెడ్డి

-

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేడు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.  రేవంత్ రెడ్డి ఇంట్లో ఇటీవల సోదాలు జరిపిన అధికారులు అక్టోబర్ 3న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేడు 10:30 గంటలకు ఆయన విచారణకు హాజరు కానున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో పురోగతి సాధించడమే లక్ష్యంగా  సోమవారం, మంగళవారాల్లో సెబాస్టియన్, ఉదయసింహ, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, ఆయన మామ పద్మారెడ్డిలను రేవంత్ రెడ్డి ఆస్తుల సంపాదన గురించి ఆయన వ్యాపారాల గురించి వివిధ కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరుకానున్న రేవంత్ పై ఐటీ అధికారుల ప్రశ్నలు ‘ఓటుకు నోటు’ కేసు చుట్టూనే తిరిగే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వాలని భావించిన రూ.50 లక్షల గురించే ప్రధానంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.

బుధవారం  రేవంత్‌ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించిన తర్వాత మరోసారి  సెబాస్టియన్, ఉదయ సింహ, కొండల్‌రెడ్డిలను విచారించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఐటీ దాడులు, సీబీఐ విచారణల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు ఆరోపించిన నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version