చంద్రబాబుకు రిమాండ్.. మంత్రి అంబటి ట్వీట్

-

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ‘కోట్ల రూపాయలిచ్చి “లూత్రా”ని తెచ్చినా.. పస లేకపోతే “పొన్నవోలు” ముందు బలాదూర్!’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు ఏపీవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. అనేక చోట్ల ప్రభుత్వం, జగన్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రబాబు రిమాండ్‌ను నిరసిస్తూ సోమవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.

ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనేక మండలాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే మార్గంలో ఎలాంటి సమస్యా తలెత్తకుండా రహదారి మొత్తం గట్టి భద్రత ఏర్పాటు చేశారు. స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనేక చోట్ల ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకోగా, కొన్ని చోట్ల హౌజ్ అరెస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version