వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు. అయితే వల్లభనేని వంశీ బెయిల్ పై ఈనెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో బెయిల్ ఇవ్వాలంటూ సీఐడీ కోర్టును ఆశ్రయించారు వంశీ. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వొద్దని.. అతనికి బెయిల్ ఇస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారన్న కోర్టులో వాదనలు వినిపించారు. సీఐడీ తరపు న్యాయవాది.. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది.
మరోవైపు వల్లభనేని వంశీని ఇవాళ కోర్టులో హాజరు పరిచారు జైలు అధికారులు. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో ఆయనను కోర్టులో హాజరు పరిచారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్టు నమోదైన కేసులో వల్లభనేని వంశీని ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.