వస్తున్నాడు… బాబొచ్చేస్తున్నాడు ! కాస్కోండి

-

ఎక్కడో పక్క రాష్ట్రం లో దాక్కుని,  ఏపీ మీద ప్రేమ ఒలకబోయడం కాదు, ఇక్కడి  విషయాలపై తమపై విమర్శలు చేయడం కాదు, దమ్ముంటే ఇక్కడకు వచ్చి మాట్లాడండి అని, ఎంతగా కవ్వించినా, జూమ్ బాబు అంటూ అవహేళన చేసినా, చంద్రబాబు కానీ ఆయన పుత్రరత్నం లోకేష్ గాని హైదరాబాద్ విడిచి ఏపీకి వచ్చేందుకు అసలు ఏమాత్రం ఇష్టపడలేదు. అంతేకాదు తాము హైదరాబాదులోని తమ సొంత నివాసంలో సేదతీరుతూ పార్టీ కేడర్ ను మాత్రం ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేయవలసిందిగా , పదేపదే పిలుపులు, ప్రకటనలు, ఆదేశాలు, రిక్వెస్ట్ లు ఇలా ఎన్ని చేసినా, పార్టీ కేడర్ లో మాత్రం ఎక్కడా అ కదలిక లేకపోగా, తండ్రి కొడుకులు ఇద్దరూ బాగానే విశ్రాంతి తీసుకుంటూ, తమను మాత్రం వీధుల్లోకి వచ్చి పోరాటం చేయమంటారా ? అంటూ తెలుగు తమ్ముళ్లు ఒక రేంజ్ లో తగులుకున్నా, ఇల్లు విడిచి బయటకు వచ్చేందుకు ఇష్టపడలేదు.

కానీ ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత, ఇంకా హైదరాబాద్ ను పట్టుకుని వేలాడితే, ఏపీ ప్రజల్లో కాని, పార్టీ నేతల్లో కానీ, చులకన అయిపోతామని, అలాగే ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేసేందుకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్లు అవుతుందని అనుకున్నారో ఏమో కానీ, టిడిపి అధినేత చంద్రబాబు ఏపీకి వచ్చేందుకు సిద్ధమైపోయారు. ఇక కష్టమైన, నష్టమైన ఏపీ లోనే ఉండాలని, తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ఏపీకి చంద్రబాబు వచ్చేందుకు ఈరోజు పయనమవుతున్నారు.

ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారానే చంద్రబాబు అన్ని వ్యవహారాలను నడిపించారు. చివరకు మహానాడును సైతం జూమ్ నుంచే నిర్వహించారు. అధికార పార్టీ పై విమర్శలు, పోరాటాలు ఉద్యమాలు ఇలా అన్నిటినీ ఆన్లైన్ వేదికగానే నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షం ఎక్కడికి పారిపోలేదు అని నిరంతరం పోరాడుతూనే ఉంటాను అనే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. కానీ ఈ సమయంలో పార్టీ కేడర్ లో నిరాశ నిస్పృహలు అలుముకోవడం, విధుల్లోకి వచ్చి పోరాడినా, కేసుల్లో చిక్కుకోవడం తప్ప, ఉపయోగం ఏముంటుంది అనే రకరకాల అభిప్రాయాలతో పార్టీ క్యాడర్ ఉండిపోవడంతో, రోజు రోజుకి పార్టీ భవిష్యత్ అంధకారం లోకి వెళ్ళిపోతోంది. ఇవన్నీ బేరీజు వేసుకుని చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేందుకు కారణమట.

అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చిన క్షేత్రస్థాయి పోరాటాలు చేపట్టేందుకు సిద్ధంగా లేరు. ఇక్కడ కూడా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. 70
సంవత్సరాల వయస్సు నిండిపోవడంతో జనాల్లో తిరగడం అంత సేఫ్ కాదు.అందుకే  అప్పుడప్పుడు పార్టీ కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించి, పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపాలని చూస్తున్నారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం పారిపోయిందనే విమర్శలు రాకుండా, తాను రాష్ట్రంలోనే ఉన్నాను అని, ఎక్కడికి పారిపోలేదు అనే సమాధానం చెప్పేందుకు ఇప్పుడు చంద్రబాబు ఆకస్మాత్తుగా ఏపీకి వస్తున్నట్టుగా అర్థం అవుతోంది.

-సూర్య 

Read more RELATED
Recommended to you

Exit mobile version