తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి నాగేశ్వరరావు, తోట త్రిమూర్తులు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించనున్నట్టు సమాచారం.
తాజా రాజకీయ పరిణామాలు, కార్యకర్తలతో జరగనున్న కార్యక్రమం పై జగన్ కీలక నేతలతో సమీక్షించనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అంశం పై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు జగన్. ఈ మధ్యే జగన్ లండన్ పర్యటనకు వెళ్లి వచ్చారు. లండన్ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లి.. నిన్న ఏపీకి చేరుకున్నారు జగన్.