చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో తుదివాదనలు

-

స్కిల్ డెవలప్​మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బెయిల్​ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదుచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్​ను దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌రోహత్గీ కోర్టును సమయం అడిగారు. ఈ నేపథ్యంలో మంగళవారానికి వాయిదా వేసిన ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే రోహత్గీ వాదనలు విననుంది.

ముకుల్‌రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్‌ వాదనలు ప్రారంభించనున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా చెబుతుందా? అన్నది తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version