పోలవరం గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ విధ్వంస ముఠాకు లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాజాగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విధ్వంస ముఠా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతుంటే యజ్ఞయాగాదుల గురించి మాట్లాడుతున్నట్టు ఉందని పేర్కొన్నారు. వైసీపీకి సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. డయాఫ్రమ్ వాల్ గురించి తెలియని వ్యక్తికి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని చెప్పారు.
పోలవరం ఎప్పుడూ పూర్తి అవుతుందో తెలియని వ్యక్తికి పోలవరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 2020 జూన్ లో పూర్తవుతుందని ఒకసారి 2021 డిసెంబర్ లో పూర్తవుతుందని ఒకసారి గతంలో మీ సీఎం కదా చెప్పింది అన్నారు. గత ప్రభుత్వం వల్ల పోలవరానికి రూ.50వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పోలవరాన్ని పట్టాలెక్కించారని తెలిపారు. కేంద్రంలో ప్రధాని, ఆర్థిక మంత్రిని జలవనరుల శాఖ మంత్రిని సీఎం చంద్రబాబు కలిసి రూ.12వేల 157 కోట్ల నిధులు మంజూరు చేయించారని.. ఇప్పుడు అడ్వాన్స్ గా 5052 కోట్ల రూపాయల నిధులు పోలవరం కోసం వచ్చాయన్నారు.