బర్రెలక్క సోదరుడిపై దాడి బాధాకరం : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

-

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే సూర్యపేటలో బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి మరువకముందే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపుతోంది. శిరీష సోదరుడుపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. శిరీష సోదరిపై దాడి చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శిరీష, ఆమె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ మేరకు తెలంగాణ డీజీపీకి సీఈవో తెలంగాణను కోరుతూ ట్యాగ్ చేశారు. ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా శిరీష బరిలోకి నిలిచింది. సోషల్ మీడియాలో బర్రెలక్కగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న శిరీష ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బర్రెలక్కకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి యువత తరలివస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అంతే కాదు దేశవ్యాప్తంగా పలువురు ఎన్నికల ప్రచారానికి ఖర్చులు సైతం పంపుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో శిరీష మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమె సోదరుడిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బర్రెలక్కకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో ఉలిక్కిపడ్డ శిరీష తన తమ్ముడిపై ఎందుకు దాడి చేశారంటూ నిలదీసింది. సోదరుడిపై దాడిని తలుచుకుంటూ కన్నీటి పర్వంతమైంది. రాజకీయాలంటే రౌడీయిజం అని గతంలో చెప్పేవారని.. కానీ తాను ఎప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేసింది. బర్రెలక్కకు భద్రతను కల్పించాలంటూ ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే దాడులు చేసి బెదిరిస్తారా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version