బహ్రెయిన్ లో తోలి కరోనా మరణం…65 ఏళ్ల మహిళ మృతి

-

కరోనా తీవ్రత ప్రపంచదేశాల్లో ఎక్కువగా ప్రబలుతున్న సంగతి తెలిసిందే. మొదట డ్రాగన్ దేశం చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ ఆ తరువాత ఇటలీ,ఇరాన్,యూరప్ దేశాల్లో దీని తీవ్రత ప్రబలుతుంది. ప్రస్తుతం 156 దేశాలకు విస్తరించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 6000 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గల్ఫ్ దేశం అయిన బహ్రెయిన్ లో సోమవారం తోలి కోవిడ్-19 మరణం నమోదైనట్లు తెలుస్తుంది. ఇరాన్‌ నుంచి వచ్చిన 65 మహిళ ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఆమె ప్రయాణం తర్వాత ఎవరినీ నేరుగా కలవలేదని.. ఐసోలేషన్‌ వార్డులోనే ఉన్నారు కాబట్టి.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆ దేశ ఆరోగ్య శాఖ పేర్కొంది. అదే విధంగా ఇప్పటిదాకా దేశంలో 214 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది. అయితే తాజాగా 65 ఏళ్ల మహిళ మృతి చెందడం తో గల్ఫ్‌ దేశాల్లో తొలి కరోనా మృతిని నమోదు చేసిన దేశంగా బహ్రెయిన్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో “మనం అతికష్టమైన సవాలును ఎదుర్కొంటున్నాం.

కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా” అని బహ్రెయిన్‌ ఆరోగ్య శాఖా మంత్రి తాఫిక్‌ అల్‌ రాబియా సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు. దీంతో నెటిజన్లు కూడా తమ సంఘీభావాన్ని తెలుపుతూ ” మేమంతా ఇంట్లోనే ఉంటాం అందరి శ్రేయస్సు కోసం” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను పోస్ట్ చేశారు. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా జిమ్ములు, పబ్లిక్‌ పార్కులు, స్పాలు మూసివేస్తున్నాయి. మరోపక్క కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు దిగివస్తున్న వేళ తమ మార్కెట్‌కు అండగా నిలిచేందుకు అబుదాబి సోమవారం భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version