ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. కల్వకుంట్ల ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ డ్రామా అంతా జరుగుతోందని బాంబు పేల్చారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య నాలుగు ముక్కలాట నడుస్తోందని చురకలు అంటించారు. కవిత వ్యవహారంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం ఉందా? అని నిలదీశారు.

కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో బీఆర్ఎస్ ని కలపాలని ప్రయత్నం చేశారని బాంబు పేల్చారు. కాని ఆ పార్టీని మేము దగ్గరికి కూడా రానివ్వలేదని క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఆదాయాన్ని 80% రెట్టింపు చేశామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇంకో ఏడాది కాలంలో రైతుల ఆదాయాన్ని వంద శాతం రెట్టింపు చేస్తామని తెలిపారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచాం.. మార్కెట్ లో యూరియా ధరలు పెరిగిన ప్పటికీ రైతులకు సబ్సిడీ ఇస్తూ ఆ భారాన్ని కేంద్రమే మోస్తుందని పేర్కొన్నారు.