ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. రాష్ట్రంలోని 210 బీటెక్ కళాశాలలతో పాటు, రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్లో కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ.లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి.
మరోవైపు రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఇందులోకే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.