ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తి ఒక చిన్న దీవికి ఉందంటే నమ్ముతారా? ఇరాన్ ఆధీనంలో ఉన్న కార్గ్ దీవి (Kharg Island) ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడి నుంచి జరిగే చమురు ఎగుమతులు ఆగితే, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. శక్తివంతమైన దేశాలు సైతం ఈ దీవి జోలికి వెళ్లడానికి ఎందుకు భయపడుతున్నాయి? అసలు ఈ దీవికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీని వెనుక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చమురు గుండెకాయ: కార్గ్ దీవి: కార్గ్ దీవి పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఒక చిన్న భూభాగం. కానీ, ఇరాన్ ఎగుమతి చేసే చమురులో దాదాపు 90 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీర్చే ప్రధాన ‘టెర్మినల్’ ఇది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా ప్రపంచ మార్కెట్లో చమురు సెగలు రేగుతాయి.

ధరల మీద ప్రభావం ఎలా ఉంటుంది?: ఈ దీవిపై ఏదైనా దాడి జరిగినా లేదా ఇక్కడి నుంచి సరఫరా నిలిచిపోయినా, అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయి. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యుడిపై ధరల భారం పడుతుంది. అందుకే, ఏ దేశమైనా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా జాగ్రత్త పడుతుంది. ఇక చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే భయం అందరిలోనూ ఉంది.
అమెరికా ఎందుకు వెనకాడుతోంది?: అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం ఈ దీవిపై నేరుగా దాడి చేయడానికి వెనకాడతాయి. దీనికి ప్రధాన కారణం ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz). ఒకవేళ కార్గ్ దీవిపై దాడి జరిగితే, ఇరాన్ ఈ జలసంధిని మూసివేసే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణాలో మూడో వంతు ఈ సందు నుంచే జరుగుతుంది. ఇక ఇది మూతపడితే ప్రపంచం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది, అందుకే దౌత్యపరమైన చర్చలకే ప్రాధాన్యత ఇస్తారు.
వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ: ఇరాన్ ఈ దీవిని కేవలం చమురు కేంద్రంగానే కాకుండా, ఒక బలమైన సైనిక కోటగా మార్చుకుంది. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, రాడార్లతో ఈ ప్రాంతాన్ని రక్షిస్తోంది. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికి దారితీస్తుందని అగ్రరాజ్యాలకు తెలుసు. ఇక అందుకే ఆర్థిక ఆంక్షలు విధిస్తారే తప్ప, నేరుగా బాంబు దాడులకు దిగడానికి సాహసించరు.
