తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలిచినందుకు పోలీసు శాఖకు, సిబ్బందికి విషెస్ తెలిపారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో అత్యుత్తమ పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచినట్లు ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 తేల్చింది.
ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించాయి.ఇందులో తెలంగాణ పోలీస్ శాఖకు గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని,ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడంలో, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయాన్ని నిలబెట్టడంలో విజయవంతం అయ్యారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.