షుగర్ వ్యాధి ఉన్నవారు అన్నం తినడానికి చాలా భయపడుతుంటారు. తెల్ల అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్లు కూడా దానికి దూరంగా ఉండమనే సలహా ఇస్తారు. కానీ, రోజూ అన్నం తినే అలవాటు ఉన్న మన భారతీయ ఆహారంలో దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం కష్టమే. అయితే, మధుమేహాన్ని అదుపులో ఉంచే ఒక ప్రత్యేకమైన రైస్ మార్కెట్లో ఉంది. అస్సాంలో పండే ఆ ప్రత్యేక బియ్యం ఏంటి? షుగర్ పేషంట్లకు అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం.
ఏమిటీ ‘జోహా’ బియ్యం?: అస్సాంలోని గారో కొండల ప్రాంతంలో పండే ‘జోహా బియ్యం’ (Joha Rice) తన ప్రత్యేకమైన సువాసన, రుచికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక బాస్మతి బియ్యం లాగే దీనికి కూడా భౌగోళిక గుర్తింపు దక్కింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో.. ఈ బియ్యం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి అకస్మాత్తుగా పెరగవని తేలింది.

షుగర్ నియంత్రణ.. గుండెకు మేలు: జోహా బియ్యంలో ఉండే ప్రత్యేక పోషకాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఇందులో శరీరానికి మేలు చేసే ఒమేగా-3, ఒమేగా-6 అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ప్రోటీన్ గని.. రోగాల నుంచి రక్షణ: ఈ బియ్యంలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శాకాహారులకు ఇది మంచి పోషకాహారంగా పనిచేస్తుంది. ఇక శీతాకాలంలో ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా తినే అస్సాం ప్రజల్లో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. చివరికి ఈ బియ్యం పొట్టు నుంచి ఆరోగ్యకరమైన నూనెను కూడా తయారుచేస్తున్నారు.
ఏ బియ్యం తిన్నా మధుమేహం పూర్తిగా నయమైపోదు కానీ, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా షుగర్ను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక తెల్ల బియ్యానికి బదులుగా జోహా బియ్యం లాంటి పోషకాలున్న ప్రత్యామ్నాయాలను తగిన మోతాదులో ఎంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
గమనిక: మధుమేహం ఉన్నవారు తమ రోజువారీ ఆహార నియమాల్లో లేదా బియ్యం రకంలో ఏవైనా పెద్ద మార్పులు చేసుకునే ముందు తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యుడిని లేదా న్యూట్రిషియనిస్ట్ను సంప్రదించి సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
