త్వరలో ఏ మాయ చేశావె, ఘర్షణ సీక్వెల్: గౌతమ్​ మేనన్

-

హీరో రామ్​పోతినేని, కమల్​హాసన్​తో సినిమా చేసే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు ప్రముఖ దర్శకుడు గౌతమ్​ మేనన్​. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే సెట్స్​పైకి వెళ్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన తమిళంలో తీసిన సినిమాలు చాలా వరకు తెలుగులో మరో కథానాయకుడితో రీమేక్‌ అవుతుంటాయి. ఈసారి మాత్రం శింబుతో తీసిన ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ సినిమాను మాత్రం తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీస్రవంతి మూవీస్‌ ఈ నెల 17న చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్‌ మేనన్‌ విలేకర్లతో ముచ్చటించారు.

“ఓటీటీ వేదికల రాకతో ప్రపంచం… సినిమా పరిశ్రమలు చాలా చిన్నవైపోయాయి. ప్రేక్షకులు ఇప్పుడు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. అందుకే దీన్ని రీమేక్‌ ఆలోచన లేకుండా… ఒకేసారి అన్ని భాషలకీ చేరువ చేయాలనుకున్నా. నేను, శింబు కలిసి ఇదివరకు రొమాంటిక్‌ చిత్రాలు చేశాం. వాటితో పోలిస్తే ఇది చాలా భిన్నం. గ్యాంగ్‌స్టర్‌ కథ. చిన్న పల్లెలో జీవించే ముత్తు అనే యువకుడు కొన్ని కారణాలతో ముంబయి వెళతాడు. అతడు చీకటి ప్రపంచంలోకి ఎలా వెళ్లాడు? ఆ తర్వాత ఏమైందనేదే సినిమా. శింబుతో మొదట ప్రేమకథనే చేయాలనుకున్నా. అందుకోసం రెహమాన్‌ ఒక పాటను కూడా సిద్ధం చేశాడు. నెల రోజుల్లో చిత్రీకరణ మొదలవుతుందనగా తమిళంలో పేరున్న రచయిత జయమోహన్‌ను వేరే చిత్రం కోసం కలిశా. ఆయన 15 నిమిషాల ఓ చిన్న కథని చెప్పారు. ఆ తర్వాత పది రోజుల్లో వంద పేజీల స్క్రిప్ట్‌ ఇచ్చారు. ముత్తు కథ చదువుతుంటే విజువల్స్‌ కళ్ల ముందు మెదిలాయి. అప్పుడు ప్రేమకథను పక్కన పెట్టేసి ఈ గ్యాంగ్‌స్టర్‌ సినిమా చేయాలని నిర్ణయించా” అని అన్నారు.

“శింబు స్టార్‌ కథానాయకుడైనా… ఆయనకంటూ ఓ ఇమేజ్‌ ఉన్నా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి మెప్పించగలడు. అదే ఆయన ప్రత్యేకత. 20 ఏళ్ల కుర్రాడిగా, గ్యాంగ్‌స్టర్‌గా అసలు తెరపై శింబు కాదు, ముత్తునే అనిపించేలా నటించాడు. శింబు, రాధికా శరత్‌కుమార్‌, సిద్ధిఖీ కాకుండా… మిగతా అంతా థియేటర్‌ నేపథ్యం ఉన్న కొత్త నటులే. నేను చూపిస్తున్న ప్రపంచం ఒకటి ఉందని ప్రేక్షకులు నమ్మాలని, అందుకే కొత్తవాళ్లని ఎంపిక చేసి కెమెరా ముందుకు తీసుకొచ్చా. జయమోహన్‌ ఈ కథ చెప్పేటప్పుడు ఒక్క సినిమాగా చేయలేమనుకున్నా. కథ డిమాండ్‌ మేరకే రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించాం. సినిమాకి భాష లేదు. ఇందులో కొన్ని పాత్రలు హిందీ కూడా మాట్లాడతాయి. ఆ భావం ఏ భాషలోని ప్రేక్షకులకైనా అర్థమయ్యేలా ఉంటుంది” అని పేర్కొన్నారు.

“ఈ సినిమాని తెలుగులో స్రవంతి రవికిషోర్‌ విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది. ఆయన కొన్నేళ్లుగా నాకూ, కథానాయకుడు రామ్‌కీ మధ్య వారధిగా నిలుస్తున్నారు. ఒక సినిమా కోసం నేను, రామ్‌ కొన్ని రోజులు షూట్‌ చేశాం. కానీ ఆ ప్రాజెక్ట్‌ కొనసాగలేదు. తర్వాత నానితో చేశా. అయినా మేం కలుస్తూనే ఉన్నాం. ఈమధ్య నేను, రామ్‌ కలిసి మళ్లీ ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం. ఆ చిత్రం వచ్చే ఏడాది వేసవి తర్వాత, రవికిశోర్‌ నిర్మాణంలోనే ఉంటుంది. కమల్‌హాసన్‌తో ‘రాఘవన్‌ 2’ కోసం కథ కూడా సిద్ధం అవుతోంది. ‘ఏమాయ చేసావె’, ‘ఘర్షణ’ సినిమాలకు కొనసాగింపు ఆలోచన కూడా ఉంది” అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version