రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు, రోజుకూలీలకు నిత్యావసర ధరల పెరుగుదల పెద్ద శరాఘాతంగా మారింది. ఆకాశాన్ని తాకుతున్న బియ్యం, పప్పులు, నూనె ధరలు చూస్తుంటే అసలు బతుకు బండి ఎలా సాగాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వంటింట్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడాల్సి వస్తోంది. ప్రతి కుటుంబంపై పడుతున్న ఈ ధరల భారం, రాబోయే రోజుల్లో ఎంతటి కష్టాలకు దారితీస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బియ్యం, చక్కెర రేట్లకు రెక్కలు: కేవలం రెండు నెలల కిందటి వరకు కిలో మంచి బియ్యం ధర రూ.45 నుండి రూ.50 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక్కసారిగా రూ.70కి చేరింది. ఇక కిలో చక్కెర రూ.45 నుంచి రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగింది. ఇక ప్రతీరోజూ వాడే ప్రధాన ఆహార పదార్థాల ధరలు ఇలా పెరగడం సామాన్యుల నడుము విరుస్తోంది.
పప్పులు, వంటనూనెల బాదుడు: కూర వండాలన్నా, ప్రశాంతంగా రెండు ముద్దలు తినాలన్నా పప్పులు, నూనెలు తప్పనిసరి. అయితే కందిపప్పుతో పాటు ఇతర పప్పు ధాన్యాల ధరలు కిలోపై రూ.20 వరకు పెరిగాయి. ఇక దీనికి తోడు లీటర్ వంటనూనె ధరపై కూడా రూ.20 దాకా అదనపు భారం పడటంతో పేద, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.

రోజుకూలీల జీవనం మరీ దారుణం: రోజూ కష్టపడితే వచ్చే అరకొర సంపాదనతో రోజూవారీ ఖర్చులు వెళ్లదీయడం రోజుకూలీలకు గగనంగా మారింది. సంపాదన పెరగకపోయినా, వంటింటి ఖర్చులు మాత్రం రెట్టింపు అవ్వడంతో ఆదాయమంతా కేవలం తిండి గింజలకే సరిపోతోంది. ఇక దీంతో కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల సామాన్య మానవుడి బతుకు భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి సబ్సిడీ ద్వారా నిత్యావసరాలు అందించడంతో పాటు ధరల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటేనే పేద వర్గాలకు కాస్త ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఇక్కడ పేర్కొన్న నిత్యావసర సరకుల ధరలు ప్రాంతాన్ని బట్టి, మార్కెట్ పరిస్థితులను బట్టి కొద్దిగా మారే అవకాశం ఉంది.
