ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెల నుంచి దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అసలు ఈ కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారు? దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారు? ఏ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అక్టోబర్ నుంచి దశలవారీగా పంపిణీ: టీడీపీ మంత్రులతో నిర్వహించిన కీలక సమావేశంలో మంత్రి లోకేశ్ కొత్త పింఛన్ల అంశంపై స్పష్టత ఇచ్చారు. ఇక ప్రభుత్వం వద్దకు వచ్చిన అప్లికేషన్లన్నింటినీ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అక్టోబర్ నుంచి విడతలవారీగా కొత్త పింఛన్లు అందించాలని నిర్ణయించారు.

వితంతువులకు మొదటి ప్రాధాన్యం!: కొత్తగా ఇచ్చే పెన్షన్లలో ముఖ్యంగా వితంతువులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది అర్హులైన వితంతువులు ఉన్నారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఈ సెప్టెంబర్ నెలలోనే వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ప్రక్రియ పూర్తిచేసి అక్టోబర్ నుంచే నెలకు రూ.4,000 చొప్పున పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దరఖాస్తుల పరిష్కారం – పారదర్శకత: గతంలో పెన్షన్లు కోల్పోయిన వారు, నూతనంగా అర్హత సాధించిన వృద్ధులు, చేనేత, దివ్యాంగుల నుంచి వచ్చే దరఖాస్తులను కూడా దశలవారీగా పరిష్కరిస్తారు. ఇక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వచ్చిన ప్రతి దరఖాస్తును పారదర్శకంగా విచారించి, అర్హులందరికీ త్వరితగతిన పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్హత ఉండి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు అందడం పెద్ద ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.
గమనిక: కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
