ఆషాఢమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగల్లో ‘తొలి ఏకాదశి’ (దేవశయని ఏకాదశి) ఒకటి. ఆషాఢ మాసంలో 11వ రోజున జరుపుకునే ఈ పర్వదినం నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. దీనినే చాతుర్మాసం అంటారు. ఈ ఏడాది (2026) తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా ముహుర్తాలు ఏంటి? ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఏకాదశి తిథి, ముహుర్త సమయాలు: జ్యోతిష్య పంచాంగం ప్రకారం దేవశయని ఏకాదశి తిథి జులై 24 శుక్రవారం ఉదయం 10:08 గంటలకు ప్రారంభమై, జులై 25 శనివారం ఉదయం 11:54 గంటల వరకు ఉంటుంది. ఇక సూర్యోదయ తిథి ప్రకారం జులై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఇక జులై 25న ఉదయం పూజా ముహుర్తం 7:21 నుంచి 9:03 వరకు ఉంటుంది. ఉపవాస దీక్ష విరమణ (పారణ) జూలై 26న తెల్లవారుజామున 5:38 నుంచి ఉదయం 8:22 గంటల మధ్య చేయాలి.

ఏకాదశి రోజు ఏం చేయాలి?: ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, నైవేద్యంలో తులసి దళాలను తప్పనిసరిగా ఉంచాలి. ఇక రోజంతా ఉపవాస దీక్షను ఆచరిస్తూ భగవన్నామాన్ని స్మరించాలి. అలాగే ఈ రోజున పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలను దానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సుఖసంతోషాలు కలుగుతాయి.
ఏకాదశి నాడు చేయకూడని పనులేంటి?: తొలి ఏకాదశి నాడు పొరపాటున కూడా అన్నం తినకూడదు, మద్యం మరియు మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇక బ్రహ్మచర్యం పాటిస్తూ, ఇతరులపై కోపం లేదా చెడు ఆలోచనలు చేయకూడదు. ఈ పవిత్ర రోజున గోళ్లు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి ఆకులను మొక్క నుంచి తెంపకూడదు, పూజ కోసం ముందు రోజే కోసి ఉంచుకోవాలి.
ఇక తొలి ఏకాదశి నాటి నుంచి ప్రారంభమయ్యే చాతుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించరు. బదులుగా భగవంతుడి ధ్యానం, పూజలకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజున నియమ నిష్ఠలతో విష్ణుమూర్తిని ఆరాధించి, పవిత్రంగా ఉండటం వల్ల సకల కష్టాలు తొలగిపోయి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
గమనిక: ఇక్కడ అందించిన పూజా ముహుర్తాలు, తిథి వివరాలు పంచాంగం మరియు ఆధ్యాత్మిక పండితుల సూచనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. మీ ప్రాంతీయ సిద్ధాంతాలను బట్టి పూజా సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
