సముద్రం అడుగున కోట్లు విలువ చేసే బంగారం..!

-

కొలంబియాలో.. తాజాగా సముద్ర గర్భంలో బంగారాన్ని గుర్తించారు. రెండు వందల సంవత్సరాల క్రితం.. మునిగిపోయిన నౌకల శిథిలాల కింద బంగారు నాణేలను అధికారులు గుర్తించారు. వీటి విలువ 17 బిలియన్‌ డాలర్లు పైనే ఉంటుంది.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.32 లక్షల కోట్లకు పైమాటే ఉంటుందట.
1708లో స్పెయిన్‌ యుద్ధం జరిగిన సమయంలో ఆ దేశానికి చెందిన శాన్‌ జోస్‌ అనే భారీ నౌక బ్రిటిష్‌ దాడుల్లో మునిగింది. ఆ సమయంలో నౌకలో 600 మంది ప్రయాణికులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు వంటివి కూడా చాలా ఉన్నాయి. ఈ నౌక శిథిలాలను 2015లో గుర్తించారు. అప్పటి నుంచి నౌక గురించి తెలుసుకునేందుకు కొలంబియా ప్రభుత్వం పరిశోధనలు చేస్తూనే వస్తుంది. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతిక సాయంతో సముద్ర గర్భంలోకి రిమోట్‌ కంట్రోల్ వాహనాన్ని పంపింది. ఈ క్రమంలోనే శాన్‌ జోస్‌ నౌక మునిగిన ప్రాంతానికి సమీపంలో మరో రెండు నౌకల శిథిలాలు తాజాగా బయటపడ్డాయి.
కొలంబియా తీరం నుంచి 3100 అడుగుల లోతులో ఈ నౌకలు ఉన్నట్లు ఆ వాహనం గుర్తించిందట. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొలంబియా ప్రభుత్వం విడుదల చేసింది. నౌకల శిథిలాల్లో అనేక బంగారు నాణేలతో పాటు చెల్లా చెదురుగా పడి ఉన్న కుండలు.. చెక్కు చెదరని పింగాణీ కప్పులు కూడా గుర్తించారు. ఓ నౌకకు ఉన్న విల్లు ఇప్పటికీ ఏ మాత్రం చెడిపోలేదు.. ఈ నౌకల్లో ఒకటి కలోనియల్‌ బోట్, మరొకటి షూనర్‌ అని అధికారులు ధ్రువీకరించారు.
1810లో స్పెయిన్‌ నుంచి కొలంబియాకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ నౌకలు మునిగిపోయి ఉండొచ్చని..అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు రెండు శతాబ్దాల కిందటివి అనమాట.. ఇప్పుడు ఈ నౌకలపై పరిశోధనలు చేపట్టనున్నట్లు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ తెలిపారు. మొత్తానికి అలా వందల ఏళ్లనాటి ఆస్తిని ఆ ప్రభుత్వం గుర్తించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version