హైదరాబాద్‌లో కలకలం.. 27లోగా పాకిస్థానీయులు నగరం విడిచి వెళ్లాలని డీజీపీ ఆదేశం

-

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. నగరంలో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులందరి వీసాలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ గురువారం సాయంత్రం ప్రకటించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలో ప్రస్తుతం 208 మంది పాకిస్థాన్ జాతీయులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరూ ఈ నెల 27వ తేదీలోగా హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేస్తున్నామని, వారి ప్రయాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

పంజాబ్‌లోని అటారీ-వాఘా సరిహద్దు ఈ నెల 30వ తేదీ వరకు తెరిచి ఉంటుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పాకిస్థాన్ జాతీయులందరూ తమ దేశానికి తిరిగి వెళ్లాలని డీజీపీ సూచించారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరైనా నగరంలో ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ పాకిస్థానీయులు నివసిస్తున్నారనే దానిపై నిఘా కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వారి కదలికలను ట్రాక్ చేస్తున్నాయని, వారి భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే, దేశ భద్రత దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news