పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాక్కు గట్టి సమాధానం ఇచ్చింది. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు పీఓకేతో పాటు పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ప్రాంతాల్లో కచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు లేదా పౌరులపై ఎలాంటి దాడులు జరగలేదని, కేవలం ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా తీసుకున్నామని వెల్లడించింది. దీనిని ప్రపంచ దేశాల ముందూ స్పష్టంగా చెప్పింది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, జపాన్, సౌదీ అరేబియా వంటి కీలక దేశాలతో సంప్రదింపులు జరిపారు. ఇందులో ఎక్కువ దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి.అయితే పాకిస్తాన్కు అంతర్జాతీయంగా మద్దతు లభించకుండా పోయినప్పటికీ, టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాక్కి మద్దతు తెలిపాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ “పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులను ఖండిస్తున్నాం. భారత చర్యల వల్ల యుద్ధ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది” అని పేర్కొంది. అజర్బైజాన్ కూడా “భారత దాడుల్లో అనేక మంది పౌరులు మరణించారు, గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నాం” అంటూ స్పందించింది.