ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ మోడ్లోకి దిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్లో హై లెవెల్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిస్థితుల తాలూకు వివరాలు తెలుసుకుని, భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లకు ఎలా స్పందించాలనే దానిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. “అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలు నిరవధికంగా అందుబాటులో ఉండేలా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను అమలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేగాక, షంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రతను మరింత బలపర్చాలన్న ఆదేశాలు జారీ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద ప్రత్యేక బలగాలను మోహరించాలని అధికారులకు సూచించారు.
భద్రతా సమాచార వ్యవస్థను సమర్ధవంతంగా సమన్వయం చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో ఇంటెలిజెన్స్, పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, అవసరమైతే తదుపరి చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.