బోధన్‌లో షకీల్‌కు రిస్క్..కాంగ్రెస్-కమలం దూకుడు!

-

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీల్లో ఉన్న వివాదాస్పద ఎమ్మెల్యేల్లో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఒకరని చెప్పవచ్చు. అసలు ఈయన చిక్కుకొని వివాదం అంటూ ఏది లేదనే చెప్పాలి. పలు సందర్భాల్లో ఆయన దూకుడుగా, దురుసుగా వ్యవహరించడం పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో డబ్బులు చెల్లించే అంశంపై ఓ కిరాణా షాపు యజమానితో ఎమ్మెల్యే షకీల్ ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియో రికార్డ్స్ వైరల్ అయ్యాయి.

అటు ఆయన అనుచరులు హల్చల్ చేయడం పెద్ద ఇబ్బందిగా మారింది. ఇక మధ్య మధ్యలో ఈయన ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన బి‌జే‌పి నేత అరవింద్‌ని కలిసి ప్రశంసించారు..అలాగే సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. అరవింద్‌ని కలిసిన నెక్స్ట్ రోజు..అరవింద్ పైనే విమర్శలు చేశారు. అసలు ఈయనకు సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు వస్తున్నాయి. ఇలా అన్నీ రకాలుగా బోధన్ లో ఎమ్మెల్యే షకీల్‌కు చిక్కులు ఉన్నాయి.

దీంతో వచ్చే ఎన్నికల్లో బోధన్‌లో టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఉన్నారు. గతంలో ఈయన వరుసగా మూడుసార్లు బోధన్ నుంచి గెలిచారు. మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో కేవలం 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ బి‌జే‌పికి 8 వేల ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు బి‌జే‌పి బలం పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బోధన్ పరిధిలో బి‌జే‌పికి బాగానే ఓట్లు పడ్డాయి.

ఇటు కాంగ్రెస్, అటు బి‌జే‌పి..షకీల్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నాయి. అయితే ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి మళ్ళీ షకీల్‌కు లబ్ది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ బోధన్ ప్రజలు షకీల్ పట్ల యాంటీగా కనిపిస్తున్నారు. కాబట్టి వారు డిసైడ్ అయితే సీన్ రివర్స్ అవుతుంది. చూడాలి ఈ సారి షకీల్ గెలుస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version