Breaking : బీజేపీ నుంచి జిట్టా బాలకృష్ణా రెడ్డి సస్పెండ్

-

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇటీవల సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు. దీంతో అధిష్టానం చర్యలు తీసుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై వేటు వేసింది. జిట్టా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా కొన్ని రోజులుగా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. అంతేకాదు, మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తాను మానసికంగా కమలం పార్టీకి ఎప్పుడో దూరమయ్యానని చెప్పారు. కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందినట్లు తెలిపారు. అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను బీజేపీలో కార్యకర్తగా మాత్రమే ఉన్నానని, ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి నల్గొండలో, భువనగిరి నియోజకవర్గంలో జిట్టా బలమైన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పని చేశారు. 2009లో టీడీపీ, బీఆర్ఎస్ పొత్తు కారణంగా టిక్కెట్ దక్కలేదు. ఆ సమయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా స్వతంత్రంగానే పోటీ చేశారు. ఆ తర్వాత తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కమలదళంలో తనకు గుర్తింపు లేదనే ఆవేదన ఆయనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version