బంగారు తెలంగాణకు బదులు బంగారు కుటుంబమైంది : కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీపై కారుకూతలు కూస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్.. కొనుగోలు చేసే పార్టీ బీఆర్ఎస్ అని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞాని అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్‌కు బీ టీమ్ కాంగ్రెస్సేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నియంత్రించేది ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అని అన్నారు.

బీజేపీ గెలిస్తే గ్రామపంచాయతీ నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి లేకుండా చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఆరు లైన్స్ జాతీయ రహదారిని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే బంగారు కుటుంబం మాత్రం అయిందని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. బీజేపీ గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే ముఖ్యమంత్రి వస్తారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే పుట్టారని, ఆ పార్టీలో పని చేశారని, ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా పని చేశారన్నారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version