పవన్ జనసేన పార్టీ ప్రాణం తీశాడు : మంత్రి అంబటి

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నారా బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఈ సందర్భంగా నారా బ్రహ్మణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబును CID అరెస్టు చేస్తే.. చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ గగ్గోలు పెడుతున్నాడని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీతో జనసేన పొత్తు పై జనసేన తీర్మానం చేసిందని.. జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు మంత్రి అంబటి తెలిపారు. నాదెండ్ల మనోహర్ ఐదేళ్ళ నుంచి ఈ తీర్మానం కోసమే ఎదురు చూస్తున్నాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే అతను మాట్లాడుతున్న అబద్ధాలు అర్ధం అవుతాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏమవుతుంది.. రెండు అంకెలు కలిస్తే కొత్త అంకె వస్తుందన్నారు. రెండు సున్నాలు కలిస్తే సున్నానే వస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా, వ్యక్తిగతంగా నైతిక విలువలు లేవని.. ఒకరిని పెళ్ళి చేసుకుని మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రాణం తీశాడని.. టీడీపీకి ప్రాణం పోయాలన్న పవన్ ప్రయత్నం ఫలించే అవకాశమే లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై నోరు పారేసుకునే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నావా అని మంత్రి అంబటి ప్రశ్నించారు. పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తావన్నారు. భయాన్ని జగన్ కు పరిచయం చేస్తా అన్నాడని.. ఇప్పుడు భయాన్ని ఎవరు ఎవరికి పరిచయం చేశాడో అర్థమైంది కదా అని అన్నారు. నన్ను ఏం పీకారు అన్న చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నాడని.. ఎప్పుడు ఎవరితో ఉంటావో తెలియని మానసిక స్థితి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. నాదెండ్ల మనోహర్ కొంగు పట్టుకుని పవన్ కళ్యాణ్ సముద్రంలో ఈదుతున్నాడని అంబటి దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version