రాష్ట్రంలో తాగునీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాన్ని స్థానిక అధికారులు తిప్పి కొట్టాలని కాంగ్రెస్ శ్రేణులు, నాయకులను ఆదేశించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని, ఆ కథనాల్లో నిజమెంతో ఎప్పటికప్పుడు నివేదించాలని తెలిపారు.
తాగునీటి సరఫరా సరిగా లేకపోయినా, తప్పుడు వార్తలను ఖండించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఎర్రమంజిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రిజర్వాయర్లలో తాగునీటికి తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈ సారి తాగునీరు సరఫరా చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రూ.2 కోట్ల నిధులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.