సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

-

దళిత బంధు, బీసీ బంధులో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేఖ రాశారు.

అధికార పార్టీకి చెందినవారికే దళిత బంధు, బీసీ బంధు అందిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులకే దళిత బంధు ఇస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో దళితబంధు లబ్దిదారుల జాబితా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో 566 దళిత కుటుంబాలకు గాను 12 మందికి దళిత బంధు ఇస్తే, అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకే ఇచ్చారని వివరించారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో మరీ దారుణంగా 30 శాతం కమీషన్ తీసుకుని దళిత బంధు, బీసీ బంధు యూనిట్లు మంజూరు చేశారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వసూళ్లు ఎటు వెళుతున్నాయో, ఎవరికి చేరుతున్నాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

“అవినీతికి పాల్పడితే కన్నబిడ్డ అని కూడా చూడను అని మీరు చెబుతుంటారు. ఇప్పుడు నా వద్ద ఉన్న వివరాలు మీకు అందిస్తాను. అవినీతిపరులపై చర్యలు తీసుకోండి. మేం కూడా దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. మీకు ప్రజల్లో మంచి పేరు ఉంది. కానీ ఈ కమీషన్ల వ్యవహారంతో చెడ్డపేరు వస్తుంది. దీనిపై త్వరగా స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయండి… లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం” అంటూ కోమటిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version