రాఖీ పండుగ సందర్భంగానైనా జగన్ రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని ఆశిస్తున్నా : నారా లోకేష్‌

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై ఉత్కంఠ వీడినా.. ప్రతిపక్షాలు మాత్రం వదలడం లేదు.. ఏపీలో జరుగుతున్న సంఘటనలను ట్విట్టర్‌ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.. మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వహారాన్ని ప్ర‌స్తావిస్తూ మరోసారి నారా లోకేశ్ గురువారం వైసీపీకే చెందిన ఓ కింది స్థాయి నేత కుమారుడు మ‌హిళా ఉద్యోగుల‌ను దుర్భాష‌లాడిన వైనాన్ని ప్ర‌శ్నిస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో సర్పంచ్ కుమారుడు వైసీపీ నేత క్రాంతి కుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దుర్బాషలాడటం దారుణమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా లోకేశ్.

మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్రాంతి కుమార్ రెడ్డి పై చర్యలు తీసుకొని ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు నారా లోకేశ్. రాఖీ పండుగ సందర్భంగానైనా జగన్ రెడ్డి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి మహిళలకు న్యాయం చెయ్యాలని ఆశిస్తున్నానంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు. ఒక్క మాధవ్ పైనైనా చర్యలు తీసుకుంటే వైసీపీలో రోజుకో మాధవ్ పుట్టుకు రావడం తగ్గుతుందని కూడా వ్యాఖ్యానించారు నారా లోకేశ్. న్యూడ్ వీడియోలతో మహిళల్ని వేధిస్తున్న మాధవ్ లాంటి వారిపై చర్యలు తీసుకోకపోగా, అలాంటి వారిని ప్రభుత్వమే వెనకేసుకురావడం వలనే మహిళలకు వేధింపులు పెరిగిపోతున్నాయని అభిప్రాయ‌ప‌డ్దారు నారా లోకేశ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version