జులై 12న చంద్రయాన్‌-3 ప్రయోగం

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇస్రో ప్రయోగాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి తేదీ ఖరారు చేసింది. ఏపీలోని తిరుపతి జిల్లాలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ఏడాది జులై 12న వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆగస్టు 23 లోపు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ కాలుమోపే అవకాశముంది.

2019లో చంద్రయాన్‌-2 విఫలమైన తర్వాత చంద్రయాన్‌-3 మిషన్‌కు ఇస్రో శ్రీకారం చుట్టింది. కొవిడ్‌-19 నేపథ్యంలో కొంత ఆలస్యమైనా.. గత అనుభవాల నేపథ్యంలో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తాజా ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఎల్‌వీఎం-3 వాహకనౌక చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను జాబిల్లిపైకి మోసుకెళ్లనుంది. వంద కిలోమీటర్ల ఎత్తు కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెట్టాక జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు.

చంద్రయాన్‌-2కు సంబంధించి 2019 సెప్టెంబరు 7న అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30-2.30 గంటల మధ్యలో చంద్రుడిపై ల్యాండింగ్‌ కావల్సిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. తర్వాత అది క్రాస్‌ ల్యాండింగ్‌ అయి.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన తర్వాత ఇస్రో దాని వేగాన్ని నియంత్రించలేకపోవడంతో ఉపరితలాన్ని ఢీకొట్టి ముక్కలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version