పూరీలో బాణాసంచా పేలి ముగ్గురు భక్తులు మృతి.. 30మందికి పైగా గాయాలు

-

ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ జరిగిన బాణసంచా పేలుడులో ముగ్గురు మృతిచెందారు. మరో 30 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాది మంది అక్కడికి చేరుకోగా.. కొంతమంది భక్తులు పటాసులు పేల్చారు. ఆ నిప్పు రవ్వలు సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడటంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు. పలువురు భక్తులు గాయపడ్డారు. కొంతమంది ప్రాణాలు కాపాడుకునేందుకు పుష్కరిణిలోకి దూకినట్లు అనుమానిస్తున్నారు.

 

ఈరోజు ఉదయం అండర్‌ వాటర్‌ సెర్చింగ్‌ కెమెరాలతో గాలింపు చేపట్టారు. క్షతగాత్రులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version