26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహవ్వుర్ రాణా కాసేపట్లో భారత్కు రానున్నాడు. నిందితుల అప్పగింత ప్రక్రియలో భాగంగా అమెరికా రాణాను భారత్ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అక్రమంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేసిన అధికారులు అతణ్ని తరలించేందుకు బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
ఈ క్రమంలో నగరంలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. SWAT కమాండోలను ఎయిర్ పోర్టు వద్ద మోహరించారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ తో పాటు మార్క్స్ మ్యాన్ వెహికిల్ స్టాండ్ బైలో ఉంచినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. రాణాను తీసుకువస్తోన్న విమానం విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే.. అతడిని బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్ లో జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఇక ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్ నియమితులయ్యారు. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి రానున్నట్లు సమాచారం.