24 ఏకాదశుల ఫలితం ఒక్క రోజులోనే?.. నిర్జల ఏకాదశి విశేషాలు

-

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నిర్జల ఏకాదశి విశేషాలు తెలుసుకోవటం ముఖ్యం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ఒక్క ఏకాదశి రోజు కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే చాలు.. 24 ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఈరోజు జూన్ 25న వచ్చిన ఈ పర్వదినం విశిష్టత పూజా విధానం మరియు భీముడికి ఈ వ్రతానికి ఉన్న పౌరాణిక సంబంధం ఏంటో తెలుసుకుందాం.

ఒక్క ఏకాదశితో ఏడాది పుణ్యం: హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తుంటాయి. అయితే, వాటన్నింటిలోకి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీన్నే ‘నిర్జల ఏకాదశి’ అంటారు. ఇక ఏడాది పొడవునా ఉండే మిగతా ఏకాదశి వ్రతాలను ఆచరించలేని వారు, కేవలం ఈ ఒక్క రోజు నియమబద్ధంగా ఉపవాసం ఉంటే చాలు.. 24 ఏకాదశుల మహా పుణ్య ఫలం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

నీరు కూడా ముట్టని కఠిన ఉపవాసం: ‘నిర్జల’ అంటేనే నీరు లేనిది అని అర్థం. ఈ రోజున అన్నం మాత్రమే కాదు, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో కొలిస్తే.. వంశాభివృద్ధి కలగడంతో పాటు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మోక్షం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

భీముడు ఆచరించిన పౌరాణిక గాథ: పాండవులలో ఒకడైన భీమునికి ఆకలి చాలా ఎక్కువ, అస్సలు తట్టుకోలేడు. నలుగురు అన్నదమ్ములు, ద్రౌపది ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటుంటే తాను ఉండలేకపోతున్నానని భీముడు బాధపడ్డాడు. అప్పుడు వ్యాసమహర్షి భీమునికి ఒక ఉపాయం చెప్పాడు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజు నీరు కూడా తాగకుండా కఠినంగా ఉపవాసం ఉంటే ఏడాది మొత్తం ఉపవాసం ఉన్న పుణ్యం వస్తుందని చెప్పారు. ఇక వ్యాసుడి మాట ప్రకారం భీముడు ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందాడు. అందుకే దీనికి ‘భీముని ఏకాదశి’ లేదా ‘పాండవ ఏకాదశి’ అనే పేర్లు కూడా వచ్చాయి.

Nirjala Ekadashi: Why It Is Considered the Most Powerful Ekadashi
Nirjala Ekadashi: Why It Is Considered the Most Powerful Ekadashi

ఇంట్లో పూజించాల్సిన విధానం: నిర్జల ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి, స్నానం ముగించి, ఆహారపానీయాలు తీసుకోకుండా ఉపవాసం ఉంటానని విష్ణుమూర్తి ముందు సంకల్పం చెప్పుకోవాలి. పూజామందిరంలో ఆవునేతితో దీపారాధన చేసి, స్వామివారిని పంచామృతాలతో అభిషేకించాలి. తులసి దళాలు, పసుపు రంగు పూలతో పూజించి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఇక ఆరోగ్యం సహకరించని వారు కనీసము సాయంత్రం అయినా దీపారాధన చేసుకొని స్వామి ని ఆరాదించవచ్చు అని పండితులు తెలుపుతున్నారు..ఇక  కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి.

ఆలయ దర్శనం మరియు దానాలు: ఇంట్లో పూజ ముగిశాక దగ్గరలోని విష్ణువు గుడికి వెళ్లి తులసిమాల సమర్పించాలి. రాత్రంతా విష్ణు కీర్తనలు, భజనలతో జాగారం చేయాలి. పద్మ పురాణం ప్రకారం ఈ రోజున దానధర్మాలకు చాలా ప్రాధాన్యత ఉంది. .

ఇక నిర్జల ఏకాదశి అనేది కేవలం శారీరక ఉపవాసం మాత్రమే కాదు, మానసిక నిగ్రహానికి ప్రతీక. ఎంతో పవిత్రమైన ఈ రోజున భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసంతో, నియమబద్ధంగా స్వామిని ఆరాధిస్తే అటు ఆరోగ్యం, ఇటు ఆధ్యాత్మిక ఉన్నతి రెండూ లభిస్తాయి.

గమనిక: హిందూ పురాణాలు, తెలుగు పంచాంగం మరియు జ్యోతిష్య శాస్త్ర పండితులు అందించిన సాంప్రదాయ విశేషాల ఆధారంగా ఈ సమాచారం అందించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news