అమెరికా వాణిజ్య విధానం ఇచ్చిపుచ్చుకునే విధంగా న్యాయంగా ఉంటుందని దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్ విధానం పై ఆయన ట్విట్టర్ వేదిక గా ఓ పోస్టు చేశారు. తమ వాణిజ్య విధానంలో ఎక్కువ, తక్కువలకు చోటు ఉండదన్నారు. అందరూ సమానమే అన్నారు. ఆయా దేశాలు తమ వస్తువులపై ఎంత సుంకాలు విధిస్తాయో తాము అంతే విధిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఏ దేశమైనా భావిస్తే ముందు ఆ దేశం అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించుకోవాలి లేదా పూర్తిగా తీసేయాలని ట్రంప్ సూచించారు.

అమెరికాలో ఉత్పత్తి, వస్తువుల తయారీ చేపడితే సుంకాలు ఉండవని తెలిపారు. సుంకాల విషయంలో అమెరికా మిత్ర, శత్రు దేశాలు చాలా కాలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాతో వాణిజ్యం నిర్వహించే దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.