ప్రైవేట్ ఆస్పత్రులు దారుణాలకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా గర్బిణికి నర్సులు ఆపరేషన్ చేయగా.. గర్భంలోనే కవలలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం జరిగినా.. సంతానం కలగక పోవడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్నారు.ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు.
ఆ సమయంలో వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో.. డాక్టర్ వాట్సప్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు గర్భిణి కీర్తికి ఇంజక్షన్లు ఇచ్చి నర్సులు చికిత్స చేయగా.. వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు మగ శిశువులు మృతి చెందారు.అనంతరం చికిత్సకు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.ఇప్పటికే సంతానం కోసం రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశామని.. కవల పిల్లలు పుడుతున్నారని తెలిసి సంతోషంగా ఉన్న సమయంలో ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.విషయం తెలిసి ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు సీజ్ చేశారు.