పోలీస్ శాఖకు అధిపతిగా ఉండి, మరీ ఇంతలా దిగజారతారా?

-

పోలీస్ శాఖకు అధిపతిగా ఉండి, మరీ ఇంతలా దిగజారతారా? అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. రామచంద్రపై హత్యాయత్నం చేసిన వారిపైచర్యలు తీసుకోవాలని చంద్రబాబు రాసిన లేఖపై స్పందించిన డీజీపీ, మంత్రులు బొత్స, కొడాలినానీ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు లేఖ రాసినట్లుగానే, డీజీపీ విజయసాయికి లేఖ రాయగలడా? అని ఆయన ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మంత్రి కొడాలి మాట్లాడినా, ఆయనపై 153 (ఏ), 295, 295 (ఏ) సెక్షన్ల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశమున్నా డీజీపీ ఎందుకు స్పందించడం లేదు? అని  పట్టాభి ప్రశ్నించారు.

వారెంట్ కూడా లేకుండా నానీని అరెస్ట్ చేయవచ్చని చట్టం చెబుతుంటే, ఆ పని డీజీపీ ఎందుకు చేయరు? అని ఆయన ప్రశ్నించారు. తన టోపీపై ఉన్న మూడు సింహాలను డీజీపీ తాడేపల్లి ప్యాలెస్ లో తాకట్టు పెట్టారా? అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంపై జరిగిన 19 ఘటనల్లో, 12 సంఘటనలకు సంబంధించి అరెస్ట్ చేసిన వారిని మీడియా ముందుకు ఎందుకు తీసుకురావడం లేదో డీజీపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారేం మాట్లాడాలో, ఎవరిపేర్లు చెప్పాలో ట్రైనింగ్ ఇస్తూ, వారికి తాడేపల్లి స్ర్కిప్ట్ నేర్పుతున్నారా? అని అయన ప్రశ్నించారు. అధికార పార్టీకి వంతపాడుతూ, పక్షపాత ధోరణితో మాట్లాడటం డీజీపీ స్థాయికి తగదని పట్టాభి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version