కేరళలోని ప్రసిద్ధ శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం మళ్లీ భక్తులతో కళకళలాడుతోంది. మలయాళ నూతన సంవత్సరం ‘చింగం’ మాసం ప్రారంభం కావడంతో ఆలయాన్ని తెరిచారు. మీరు కూడా స్వామి వారి దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఆలయం ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది, మళ్లీ ఓణం పండుగకి ఎప్పుడు తెరుచుకుంటుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
శబరిమలలో కొత్త సంవత్సరం సందడి: మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసం ప్రారంభం కావడంతో శబరిమల కొండల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక సోమవారం తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు పదునెట్టాంబడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు. అంతకుముందు రోజు సాయంత్రమే పవిత్ర ఆజిలో అగ్నిని వెలిగించి పూజలు ప్రారంభించారు.
చింగం మాసం పూజల తేదీలు: ప్రస్తుతం ప్రారంభమైన ఈ చింగం మాసం ప్రత్యేక పూజలు ఆగస్టు 21 వరకు కొనసాగుతాయి. ఇక ఆగస్టు 21వ తేదీ రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. కాబట్టి ఈ మధ్యలో వెళ్లేవారు దర్శన వేళలను చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

మేళశాంతి సహాయకుడి ఎంపిక: ఈ ప్రత్యేక పూజల సమయంలోనే మరో ముఖ్యమైన కార్యక్రమం జరగనుంది. ఉష పూజ ముగిసిన తర్వాత, శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడైన మేళశాంతికి పూజా కార్యక్రమాల్లో సహాయం అందించే ‘ఉల్కాజకం’ను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు.
ఓణం సందర్భంగా మళ్లీ ఆలయం తెరిచే తేదీ: చింగం మాసం పూజలు ముగిశాక, ఓణం పండుగ కోసం ఆగస్టు 24న శబరిమల ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకుంటాయి. ఇక ఈ ఏడాది అత్యంత పవిత్రమైన తిరువోణం పండుగ ఆగస్టు 26న రానుంది. ఆ సమయంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శబరిమలలో ప్రస్తుతం ప్రారంభమైన ఈ పూజల సీజన్ భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి మంచి అవకాశం. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఆలయం తెరిచే, మూసే తేదీలను సరిగ్గా గుర్తుంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాం.
గమనిక: శబరిమల ప్రయాణానికి వెళ్లే భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్, ఆలయ సమయాలు మరియు కేరళ దేవస్వం బోర్డు విడుదల చేసే తాజా మార్గదర్శకాలను ఒకసారి సరిచూసుకుని బయలుదేరడం శ్రేయస్కరం.
