చిన్నప్పటి నుంచి మన ఇళ్లలో “టీవీ దగ్గరగా చూడకు.. కళ్లు పోతాయి” అని పెద్దవాళ్లు చెబుతుండటం మనం వింటూనే ఉంటాం. నిజంగానే టీవీ దగ్గరగా చూస్తే చూపు పోతుందా? లేక కేవలం కళ్లు అలసిపోతాయా? ఈ విషయంపై సైన్స్ ఏం చెబుతోంది, నిపుణుల అభిప్రాయం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..
సైన్స్ ఏం చెబుతోంది?: టీవీకి దగ్గరగా కూర్చుని చూడటం వల్ల చూపు శాశ్వతంగా పోతుందని అనుకోవడం ఒక పొరపాటు. అలా చూడటం వల్ల కంటి కండరాలపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా కళ్ల నొప్పి, తలనొప్పి, అలసట లేదా చూపు మసకబారడం వంటివి మాత్రమే జరుగుతాయి. ఇక దీనివల్ల శాశ్వత అంధత్వం రాదని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (AAO) స్పష్టం చేసింది. పిల్లలు టీవీకి మరీ దగ్గరగా కూర్చుంటుంటే వారికి ఇప్పటికే దూరపు చూపు సమస్య ఉండవచ్చని అర్థం చేసుకోవాలి.
కళ్లపై ఒత్తిడి పెరగడానికి కారణాలు: ఎక్కువసేపు స్క్రీన్ వైపు చూస్తూ ఉండటం వల్ల మనం కనురెప్పలు ఆర్పడం మరిచిపోతాం. దీనివల్ల కళ్లు పొడిబారిపోతాయి. అలాగే చీకటి గదిలో కేవలం టీవీ వెలుగు మాత్రమే చూస్తున్నప్పుడు కళ్లపై ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు: ఇక సరైన దూరం ముఖ్యం. టీవీ సైజుకు కనీసం మూడు రెట్ల దూరంలో కూర్చోవడం మంచిది.
20-20-20 సూత్రం: ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుంచి చూపు తిప్పి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.
వెలుతురు: చీకట్లో టీవీ చూడకుండా గదిలో చిన్న లైట్ వేసి ఉంచాలి. అలాగే కళ్లను తరచుగా ఆర్పుతూ ఉండాలి.
టీవీకి దగ్గరగా చూడటం వల్ల చూపు శాశ్వతంగా పోకపోయినా, కళ్ల అలసట, తలనొప్పి వంటివి రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. సరైన దూరంలో కూర్చుని టీవీ చూడటం వల్ల కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.
గమనిక: మీకు లేదా మీ పిల్లలకు కళ్ల నొప్పి, తరచూ తలనొప్పి రావడం లేదా దూరంగా ఉన్నవి సరిగ్గా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే కంటి వైద్యుడిని (ఆప్తాల్మాలజిస్ట్) సంప్రదించి పరీక్ష చేయించుకోవడం శ్రేయస్కరం.
